ముగించు

దేవాలయాలు

త్రిపురాంతక ఆలయం

ఈ ఆలయాన్ని నిర్మించిన త్రిపురాసులు అనే రాక్షసులను లోక కల్యాణం కోసం శివుడు సంహరించాడు. ఈ ఆలయానికి గల మరో విశిష్టత ఏమిటంటే ప్రపంచంలో శ్రీచక్రంపై నిర్మించిన ఆలయం ఇదొక్కటే. స్వామివారి ఆలయం కొండ మీద ఉంటే, అమ్మవారి కోవెల సమీపంలోని చెరువులో ఉంది. అమ్మవారి ఆలయం పక్కన కదంబ వృక్షాలు పెరుగుతాయి. త్రిపురాంతకం, కాశీ మినహా మరెక్కడా ఈ చెట్లు లేవని లలితా సహస్రనామంలో పేర్కొన్నారు. శ్రీశైల తూర్పు ద్వారంగా పిలుచే త్రిపురాంతకం దేవస్థానాలు శ్రీశైల ఆలయ దత్తత కింద నడుస్తున్నాయి.

భైరవకోన

సీఎస్‌పురం మండలం అంబవరం, కొత్తపల్లి గ్రామానికి ఆరుకిలోమీటర్లదూరంలో ప్రకాశం-నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో తూర్పు కనుమల మధ్య ఒక లోయలో భైరవకోన క్షేత్రం ఉంది. కొండల నడుమ కొలువై ఉన్న అనేక దేవాలయాలు ఒక సమూహంగా ఉన్నాయి. అత్యంత ప్రాచీన పల్లవ దేవాలయానికి ఆభిముఖంగా ఎనిమిది చిన్నచిన్న దేవాలయాలున్నాయి. అక్కడక్కడ చెక్కిన శిలలపై ఉన్న ఆధారాలను బట్టి ఇవి 7, 8 శతాబ్ధాలకు చెందినట్లు తెలుస్తోంది. పల్లవుల శిల్పకళను వివరించే ఒక్క ముఖ్య ప్రదేశం భైరవకోన. దక్షిణ భారతదేశంలో మొట్టమొదట కనుగొన్న ప్రాచీన హిందూ దేవాలయాలు ఈ భైరవకోనలోనివే.  భైరవకోనలో ఎనిమిది హైందవ దేవాలయాలున్నాయి.  పల్లవ శిల్పకారుడైన దేరుకంతి, శ్రీశైలముని మొదలైనవారు భైరవకోన క్షేత్రాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది.భైరవకోనలోని మరో విశేషం అందాల జలపాతం. ఎత్త్తెన కొండలపైఉన్న లింగాల దొరువు నుంచి ప్రవహించి 200మీటర్ల ఎత్తునుంచి పడుతూ ఇక్కడకు వచ్చే యాత్రికులకు కనువిందు చేస్తోంది.